పురుషుల వివాహ వయసును మహిళలతో సమానంగా చేసేందుకు వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన వివిధ మంత్రిత్వ శాఖల సమావేశంలో దీనిని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ప్రస్తుతం పురుషులకు వివాహ వయస్సు 21 సంవత్సరాలు కాగా మహిళలకు 18 సంవత్సరాలుగా ఉంది. అయితే పురుషుల, మహిళల వివాహ వయస్సు ఒకే విధంగా ఉండాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ ఆగష్టులో ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిాత వ్యాజ్యం దాఖలు చేశారు. పురుషుల, మహిళల వివాహ వయస్సును సమం చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించామని బుధవారం ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ విషయంలో బాల్య వివాహ నిషేధ చట్టానికి సవరణ తెచ్చేందుకు మహిళా శిశు అభివృద్ధి శాఖ సంప్రదింపు లు మొదలు పెట్టిందని కోర్టుకు కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. దీని పై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 2020 ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు. పలు చట్టాలు మార్చాల్సి ఉన్నందున న్యాయశాఖను కూడా కక్షిదారుగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తరపు లాయర్లు కోర్టును కోరారు. ప్రస్తుతం మైనర్లు రేప్ లకు పాల్పడడం, తదితర కారణాలతో పురుషుల మరియు స్త్రీల వివాహ వయస్సును సమం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే చట్ట సవరణ చేసి దీనిని ఆమోదించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే మహిళా శిశు అభివృద్ది శాఖ చేపట్టినట్టు సమాచారం. నూతన చట్టం కనుక అమలైతే పురుషుల, మహిళల వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా మారనుంది.
దీని పై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. వివాహ వయస్సును మరింత తగ్గించడం ద్వారా చదువుల పై ప్రభావం పడుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు చదివించే బదులు త్వరగా పెళ్లి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.