ఏపీ సర్కార్ వివాదాస్పద జీవో జారీ చేసి సంచలనంగా మారింది. పత్రికా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తుల పై, సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏపీ సర్కార్ బుధవారం సాయంత్రం జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అధికారాన్ని ఆయా శాఖల కార్యదర్శులకు కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు సదరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం కల్పించింది.
ఏపీ సర్కార్ జారీ చేసిన ఈ జీవో వివాదాస్పదంగా మారింది. దీని పై జర్నలిస్టు సంఘాలతో పాటు, ప్రజా సంఘాల వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడకుండా నోర్మూసుకొని కూర్చోవాలా అని వారు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త ఘాటుగా మాట్లాడారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించేలా చేస్తుందన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసినా సర్కార్ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుందన్నారు.
ఇప్పటికే పలు చానళ్లను ప్రసారం కాకుండా అడ్డుకున్నారని,ఇప్పుడు కొత్తగా ఈ నాటకం ఏందని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ జీవోను వెనుకకు తీసుకునే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ జీవో జారీకి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఆయన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తానికి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.