ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా, చైనా అభివృద్ధి చెందిన దేశాలు అనే ట్యాగ్ ఉండడం వల్ల అనేక రకమైన ఆర్థిక లాభాలను పొందుతున్నాయని, అయితే ఇకపై అది జరగనివ్వనంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా-చైనాకు మధ్య పెద్ద ఎత్తున వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, కొద్ది రోజుల క్రితం అమెరికా ఎగుమతి వస్తువులపై సుంకం పెంచినందుకు గాను ‘‘సుంకాల రాజు’’ అంటూ ఇండియాపై ట్రంప్ మండిపడ్డారు.
జూలైలో ప్రపంచ వాణిజ్య సంస్థకు లేఖ రాసిన డొనాల్డ్ ట్రంప్, అభివృద్ధి చెందుతున్న దేశాల హోదాకు గల ప్రాతిపదికలేంటో వివరించాలని కోరారు. ప్రపంచ వాణిజ్య నిబంధనల ప్రకారం చైనా, టర్కీ, ఇండియా వంటి దేశాలకు ప్రస్తుతం అందుతున్న సౌకర్యాల నుంచి దూరం చేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
పెన్సిల్వేనియాలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ ‘‘ఆసియాలో దిగ్గజ స్థాయిలో ఉన్న ఇండియా, చైనా అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు. ఈ ట్యాగ్ ఆ రెండు దేశాలకు చాలా ఉపయోగపడుతోంది. వాళ్లు (ఇండియా, చైనా) మన నుంచి కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రతి ఒక్కరు మనల్ని ఉపయోగించుకునే ఎదుగుతున్నారు. ఇకపై నుంచి మనం అలా జరగనివ్వకూడదు’’ అని అన్నారు.