అమ్మ ఒడి.. పథకం ద్వారా కేవలం సర్కారు బడి కే కాదు.. ప్రైవేటు పాఠశాలకు పంపినా ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రైవేటు పాఠశాలలులో పండుగ వాతావరణం తీసుకువచ్చింది. ఇలా ప్రకటన చేసారో లేదో అలా ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి తెరలేపాయి.
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం లా అమ్మ ఒడి పథకం విధి విధానాలు ఖరారు కాకముందే మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి.. ఏడాదికి 15000 పొందండి అంటూ బ్యానర్లు కట్టి మరీ హడావిడి చేస్తున్నాయి. గతంలో ఇంజనీరింగ్ విద్య కోసం ఫీజు రీఎంబార్స్ మెంటు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రయివేటు విద్యా సంస్ధలు తాజా అమ్మ ఒడి పథకాన్ని తమ ఆదాయమార్గంగా మలచుకునేలా ఉన్నాయి. సరైన నిబంధనలు విధి విధానాలు రూపొందించక పోతే అమ్మ ఒడి పథకం దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుండటంతో ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలో జమ తీసుకునేందుకు ప్రైవేటు పాఠశాలలు తహతహలాడుతున్నాయన్నది వాస్తవం.