ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశలో సీఎం జగన్మోహన్ రెడ్డి శరవేగంతోచర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చెప్పారు. గురువారం ఆయన మీడియాలో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు దిశగా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులను సమాయుత్తం చేసామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా 86 శాతం సీట్లు గెలుచుకున్న పార్టీగా వైసీపీ చరిత్రలో నిలచిపోతుందని, ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మి పట్టం కట్టారని అన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో హామీల నెరవేర్చేందుకు జీవోలనుకూడా జారీ చేశారని పేర్కొన్నారు. జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, రాజన్న రాజ్యం తీసుకువచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.