భువనేశ్వర్ : ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా తిలేమాల గ్రామంలో దుండగులు బీభత్సం సృష్టించారు. నిద్ర పోతున్న వ్యక్తిని నరికి చంపి తలను తీసుకెళ్లారు దుండగులు. గ్రామానికి చెందిన సత్యనారాయణ ముండా(40) తన ఇంటి ముందు సోమవారం రాత్రి నిద్రిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి తలను దుండగులు తీసుకెళ్లారు. ఇక తెల్లవారుజామున సత్యనారాయణను నిద్ర లేపేందుకు భార్య మంచం వద్దకు వెళ్లింది. రక్తపు మడుగులో పడి ఉన్న సత్యనారాయణను చూసి ఆమె హడలిపోయింది. గ్రామస్తుల సహాయంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ శివార్లలో డాగ్ స్కాడ్తో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుడి కుమార్తె ప్రియాంక ముండా మాట్లాడుతూ.. ఉక్కపోత కారణంగా తన తండ్రి ఇంటి బయట పడుకున్నాడు. అమ్మ ఉదయం నాన్నను నిద్ర లేపేందుకు వెళ్లగా నాన్న హత్యకు గురైనట్లు తెలిసింది. తమకు గ్రామంలో ఎవరితోనూ శత్రుత్వం లేదని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.