బీహార్ రాష్ట్ర స్కూల్ బోర్డు ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అయితే టాపర్స్ లిస్టులో మొదటి 18 మంది టాపర్స్ లిస్టులో 16 మంది ఒకే స్కూల్ విద్యార్థులు కావడం వివాదాస్పదమవుతోంది. తెలుగురాష్ట్రాల్లో కూడా మా స్కూల్ నుంచి టాప్ టెన్ ర్యాంకులు సాధించినవారు వీళ్లు అంటూ ప్రకటనలు ఇచ్చే స్కూళ్లు ఉన్నాయి కానీ ఒకే స్కూల్ నుంచి ఇంత మంది టాపర్స్ వచ్చారంటే ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందని బీహార్ వాసులు అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం బీహార్ స్కూల్ అధికారిక వెబ్సైట్ bsebinteredu.inలో ఈ ఫలితాలు విడుదల చేసింది ఆ రాష్ట్ర స్కూల్ సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డు. ఇందులో సిముల్తల అవాసియా విద్యాలయకు చెందిన సావన్ రాజ్ బర్తీ 97.2 శాతం మార్కులు సాధించి, మొదటి ర్యాంకు సాధించాడు. అతనితో పాటు 9,15 ర్యాంకులు మినహా టాప్ 18 వరకూ అన్ని ర్యాంకులు ఈ సిముల్తల అవాసియా విద్యాలయ స్కూల్ విద్యార్థులకే వచ్చాయి. 9వ ర్యాంకు అలోక్ భక్తి శిక్షన్ బెట్టాయ్ స్కూల్కు చెందిన అంకేశ్ కుమార్ సాధించగా... న్యూఅప్గ్రేడ్ హై స్కూల్కు చెందిన రామ్కుమార్ సింగ్ 15వ ర్యాంకులో నిలిచాడు. టాప్ ర్యాంకులన్నీ ఒకే స్కూల్కి రావడంతో సదరు స్కూల్ దగ్గర బోర్డు సభ్యులు డబ్బులు తీసుకుని, మార్కులు వేసి ఉంటారని కొందరు అనుమానిస్తుండగా... మరికొందరు సదరు స్కూల్ విద్యార్థులతో మాస్ కాపీయింగ్కు పాల్పడించి ఉండవచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. అయితే టాపర్గా నిలిచిన సావన్ రాజ్ మాత్రం తాను ఎలాంటి అవకతవకలను పాల్పడలేదని, కావాలంటే మరోసారి ఎగ్జామ్ రాసి, తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమని చెబుతున్నాడు.