చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని… ఆ హామీ ఏమైందని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుర కోటలో ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడుతూ…. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ ఏమైందని ప్రశ్నించారు. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. మీ అందరి దీవెనలతో పాదయాత్ర పూర్తి చేశానన్నారు. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనపై ఒకసారి ఆలోచించండి అని జగన్ అన్నారు. రైవాడా రిజర్వాయర్ ఉన్నా సాగు, తాగునీటికి కష్టాలేనన్నారు. సాగు, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో గుర్తుపెట్టుకునే పనులు ఏమైనా జరిగాయా అని అడిగారు. వైఎస్ హయాంలో చక్కెర ఫ్యాక్టరీని తెరిపించారన్నారు.