శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం గురువారం సాయంత్రం ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని తెలిపారు. భక్తులకు వేగంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీహారాన్ని శోభాయాత్రగా తీసుకురానున్నట్లు తెలిపారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పేరిట టిటిడి అధికారులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఇందులో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఇతర ఇబ్బందులు అధికారులందరికి తెలుస్తుందని, తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాహనసేవలు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జరుగనున్నాయని, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు.