పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ప్రతిపక్షాలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. పార్లమెంట్ బయట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీ విధానాలను నిరసిస్తూ తృణమూల్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ ఆవరణలోని లైబ్రరీ హాల్లో జరిగింది.
ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోడీని ఎదుర్కోవడం, ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవ్వాలన్న దానిపై రాహుల్ గాంధీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం ముగిసిన తర్వాత సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్లతో పాటు మిగిలిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోకి నడుచుకుంటూ వచ్చారు.