ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా.. సల్మాన్‌ ఖాన్‌తో స్నేహమే కారణమా

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:51 PM

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ముంబయిలో శనివారం రాత్రి ఆయనపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిని హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లు గుర్తించారు.ఈ ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ కు చెందినవారమని కస్టడీలో బయటపెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బాంద్రా ఈస్ట్‌లో కాల్పుల జరిపిన ప్రదేశంలో వీరు దాదాపు నెల రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.


అయితే.. ఈ విషయంపై ఇంత వరకూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్ధిఖీ ఉండే ప్రదేశం గురించి నిందితులకు ఎవరో సమాచారం ఇచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల జరిపిన ప్రదేశానికి నిందితులు ముందుగానే ఆటోలో చేరుకున్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా లేదా మురికవాడ పునరావాస కేసుతో సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.


ఏది ఏమైనప్పటికీ త్వరలోనే మహారాష్ట్రలొ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న తరుణంలో ఈ కాల్పుల ఘటన రాజకీయ వర్గాల్లో భద్రతాపరమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. కొన్నాళ్లుగా సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. ఆయనకు మంచి స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేయడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సిద్ధిఖీకి ఎటువంటి బెదిరింపులు రాలేదని పోలీసులు తెలిపారు.


బాబా సిద్ధిఖీకి ప్రాణ హాని ఉందన్న అతడి సన్నిహితుల ఫిర్యాదుతో 15 రోజుల క్రితమే ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. భద్రత ఉన్న రాజకీయ నాయకుడికే రక్షణ లేకపోతే సామాన్యల పరిస్థితి ఏంటని ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దేశ ఆర్ధిక రాజధాని నడిబొడ్డున ఓ మాజీ మంత్రి హత్యకు గురయ్యారని, ఇదే రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతోందని సీనియర్ నేత శరద్ పవాన్ ఆరోపించారు. తక్షణమే హోమ్ మంత్రి తన బాధ్యతలు నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర హోమ్ శాఖ బాధ్యతలను మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చూస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com