ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలంతా పండగలో ఉంటే ఇలా చేస్తారా..? చంద్రబాబుకు జగన్ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:23 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ కూటమి సర్కారుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘ ట్వీట్ చేశారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు వైఖరి కూడా అలాగే ఉందని వైఎస్ జగన్ విమర్శించారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబుగారు చేస్తున్నదేంటి అంటూ జగన్ ప్రశ్నించారు.


"చంద్రబాబుగారినే అడుగుతున్నా .రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఇసుక‌ కొందామంటేనే మా ప్రభుత్వంలోbకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుక ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? " అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కూటమి పార్టీల నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్న వైఎస్ జగన్.. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా తమ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నెలరోజులకే ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. 2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.


"ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు.ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే.." అంటూ జగన్ ట్వీట్ చేశారు.


ఇసుక పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే మరోవైపు టెండర్లు పిలిచారన్న జగన్.. ఉద్దేశపూర్వకంగా రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారని ఆరోపించారు. గతంలో తాము అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశామన్న జగన్.. దోపిడీలకు అడ్డుకట్టవేసి ప్రభుత్వానికి ఆదాయం రావటంతో పాటుగా ప్రజలకు కూడా తక్కువ ధరకే అందేలా చూశామన్నారు. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించామని.. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేసినట్లు గుర్తుచేశారు. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా చేశామన్న వైఎస్ జగన్.. ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశామన్నారు. మరి మీ హయాంలో ప్రభుత్వానికి రూపాయైనా వస్తోందా అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com