కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివ్ బొనాంజా. దీపావళి పండక్కి ఉద్యోగులకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ నిర్వహణ విభాగం. ఆర్థిక సంవత్సరం 2023-24కు గానూ నాన్- ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అందించేందుకు ఆమోదం తెలుపినట్లు ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు అక్టోబర్ 10, 2024 రోజునే ఆర్డర్ జారీ చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. 2023-24కు గానూ ఉద్యోగులకు 30 రోజుల వేతన బోనస్ రూపంలో అందించనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అర్హులైన ఉద్యోగుల్లో గ్రూప్ సీ, గ్రూప్ బీ లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులు అర్హులు. అయితే, వారు ఏదైనా ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకంలో ఉండకూడదని ఆదేశాల్లో పేర్కొంది ఆర్థిక శాఖ. ఈ బోనస్ లెక్కించేందుకు గరిష్ఠ నెలవారీ శాలరీ రూ.7 వేలుగా పేర్కొంది. అలాగే ఈ బోనస్ అనేది సెంట్రల్ పారా మిలిటరీ బలకాలు, సాయుధ బలగాల్లోని సిబ్బందితో పాటు కేంద్రం పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులుకు సైతం వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వేతనాల నిబంధనలను అనుసరిస్తూ ఈ బోనస్ జారీ ఉంటుందని వెల్లడించింది. ఈ బోనస్ పొందేందుకు మార్చి 31, 2024 లోపు ఉద్యోగంలో ఉండి కనీసం ఆరు నెలల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి అర్హత లభిస్తుంది. అలాగే ఒక ఏడాది మొత్తం పూర్తి చేయని వారికి ప్రో రాటా బోనస్ వారు పని చేసిన నెలల ఆధారంగా అందుతుంది.
బోనస్ మొత్తం సగటు పారితోషికాన్ని 30.4తో భాగించి.. ఆపైన దానిని 30 రోజులతో గుణించడం ద్వారా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలవారీ వేతనం రూ.7000 అయితే, అతనికి బోనస్ రూ.6,908 వస్తుంది. మరోవైపు.. వరుసగా మూడేళ్ల పాటు ఏడాదికి 240 రోజులపైన పని చేసిన సాధారణ కార్మికులకు సైతం ఈ బోనస్ వర్తిస్తుంది. వారికి నెలకు రూ.1200 చొప్పున లెక్కిస్తారు. ఈ బోనస్ అందించేందుకు అయ్యే ఖర్చులను ఆయా మంత్రిత్వ శాఖలు భరిస్తాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రకటన వచ్చిన క్రమంలో ఉద్యోగులకు దీపావళి ముందే వచ్చినట్లయింది. ఈ దీపావళికి అదనంగా ఆర్థిక సాయం అందడంతో పండగ మరింత గ్రాండ్గా చేసుకునేందుకు వీలు కలగనుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa