ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారుక్, సల్మాన్‌ల మధ్య కోల్డ్‌వార్.. ఇఫ్తార్ విందుతో ఇద్దర్నీ కలిపిన బాబా సిద్ధిఖీ

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:49 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరం నడిబొడ్డున మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండుగులు కాల్చి చంపిన ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎన్సీపీలో ఉన్న బాబా సిద్ధిఖీకి బాలీవుడ్‌ తారలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. తరుచూ ఖరీదైన పార్టీలు నిర్వహించి, వారిని ఆహ్వానించేవారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు సిద్ధిఖీ మంచి స్నేహితుడు. తన స్నేహితుడు సిద్ధిఖీ హత్యకు గురైన సమయానికి సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌లో ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే షూటింగ్‌ రద్దు చేసుకుని హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వచ్చారంటే వీరి మధ్య ఎంత అనుబంధం ఉందో అర్ధం చేసుకోవచ్చు.


అంతేకాదు, ఒకప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య విబేధాలు సమసిపోయి స్నేహితులుగా కలవడానికి సిద్ధీఖీ కారణం అంటే నమ్ముతారా? అవును ఇది నిజం. ఇరువురి మధ్య సాగుతోన్న కోల్డ్‌వార్‌కు 2013లో సిద్ధిఖీ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ పార్టీతో ముగింపు పడింది. దీనికి ముందు ఇద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు మాట్లాడుకోలేదు. ఒకరినొకరు పలకరించుకోనూలేదు. ఈ విందులో వ్యూహాత్మకంగా బాబా సిద్ధిక్ సల్మాన్ తండ్రి సలీం ఖాన్ పక్కన షారూఖ్‌ను కూర్చోబెట్టాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడకు వచ్చిన సల్మాన్ ఖాన్‌ను చూసి , కింగ్ ఖాన్ లేచి నిలబడి పలకరించారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఇది అప్పట్లో వైరల్ అయ్యింది


ఇక, కాంగ్రెస్ పార్టీ ద్వారా 1977లో తన టీనేజ్‌లో రాజకీయాల్లోకి వచ్చిన బాబా సిద్ధిఖీ.. తక్కువ కాలంలోనే ఆ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. కాంగ్రెస్ నాయకుడు సునీల్ దత్‌‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అది 1999లో బాంద్రా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి విజయాన్ని సాధించడానికి సిద్ధిక్‌కు మార్గం సుగమం చేసింది. అక్కడ నుంచి ఆయన వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2008 వరకు విలాస్‌రావు దేశ్‌ముఖ్ క్యాబినెట్‌‌లో ఆహార, పౌర సరఫరాలు, కార్మిక, ఎఫ్డీఏ, వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్నారు.


కాంగ్రెస్ పార్టీలో 48 ఏళ్ల పాటు కొనసాగిన సిద్దిఖీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎన్సీపీ (అజిత్ పవార్)లో చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వ్యక్తిగత కారణాలు, న్యాయపరమైన వివాదాలు, మురికవాడలో పునరావాస ప్రాజెక్ట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని సన్నిహితులు అంటారు. ఎన్సీపీలో చేరినప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘నా రాజకీయ ప్రయాణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో మొదలైంది.. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాకు తండ్రిలాంటి వాళ్లు.. అయితే వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com