ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:41 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం ప్రజలపై పడకుండా పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్ ప్రసాద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వీలైనంత వరకుప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్-సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.


నిత్యావసర వస్తువులకు రాయితీలు ఇవ్వడం కంటే.. మూడు శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరల పెరుగుదలను గమనించి చర్యలు తీసుకోవాలన్నారు. ధరలు పెరిగిన తరువాత తగ్గించే ప్రయత్నం చేయడం కంటే ధరల పెరుగుదలను నియత్రించే ప్రయత్నం చేయాలన్నారు. పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి ధరల నియంత్రణ, తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు అధికారులకు కొన్ని సూచనలు చేశారు.


రాష్ట్రంలో రైతు బజార్లలో కౌంటర్ల ద్వారా చేపట్టిన నిత్యావసర వస్తువుల అమ్మకాల వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లలో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమాటా, ఉల్లిపాయల విక్రయాలపై ఆరా తీశారు. అంతేకాదు విజిలెన్స్ అధికారులు అలర్ట్‌గా ఉండాలని.. వ్యాపారులు కూడా సహకరించేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. భారీగా గిడ్డంగులను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు, వినియోగదారులకు న్యాయం చేయొచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ధరల నియంత్రణ విషయంలో ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు ఉంటేనే ప్రజలు హర్షిస్తారని.. ఆ స్థాయిలో అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ నెలాఖరు వరకు రైతు బజార్లలో నిత్యావసరాలను పంపిణీ చేయాలని సూచించారు చంద్రబాబు.


రైతు బజార్లలో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమాటా, ఉల్లిపాయలు మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు.


ధరల నియంత్రణ విషయంలో వర్తకులు సహకరించాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజలకు విక్రయించే ఉల్లి, టమాటా నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. అలాగే వంట నూనెల ధరల నియంత్రణ, కృత్రిమ కొరత సృష్టించడం, సరుకును దాచిపెట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ముఖ్య మంత్రికి మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూనె, ఇతర నిత్యావసరాలను తక్కువ ధరకే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com