ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్టూ అవసరం లేదు.. బిట్టూ అవసరం లేదు.. వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 06:57 PM

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు సైతం ఎత్తిచూపిందని జగన్ విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ దుర్భుద్ధితో మతవిశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారనేదీ సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని వైఎస్ జగన్ అన్నారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు చేశారని.. ఆ లడ్డూలను తిన్నారంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేసి.. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ విషయాన్ని గ్రహించే కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. చంద్రబాబు వేసిన సిట్ రద్దుచేసిందన్నారు. చంద్రబాబు అబద్ధాలను సుప్రీంకోర్టు గ్రహించినప్పటికీ.. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం టీడీపీ వక్రీకరిస్తోందని, తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.


చంద్రబాబుకు దేవుడంటే భక్తీ, భయం రెండూ లేవన్న వైఎస్ జగన్.. ఉంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పినా కూడా.. ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్‌కు ఇదంతా అబద్ధమని తెలిసినా కూడా దానికి రెక్కలు కట్టారని ఆరోపించారు. అబద్ధాలు చెప్తూ తిరుమల విశిష్టతను దెబ్బతీయడమేనా సనాతన ధర్మమంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. అసలు సనాతన ధర్మమంటే పవన్‌ కళ్యాణ్‌కు తెలుసా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో వీళ్లు ఆడుకుంటున్నారన్న వైఎస్ జగన్.. తెలిసీ తెలిసీ వెంకటేశ్వరస్వామితో ఆటలు ఆడుతున్నారా అంటూ ప్రశ్నించారు. వెంకన్న స్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.


" సనాతన ధర్మమంటే ఈ మనిషికి తెలుసా అసలు?.. నువ్వా కూటమిలో ఉన్నావు. చంద్రబాబు తప్పు చేశాడు. తప్పు అని నీతో సహా ఆరేళ్ల పిల్లాడికి కూడా తెలుసు. నీ కళ్ల ఎదుటే వెంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను, విశిష్టతను తగ్గిస్తూ రాజకీయ లబ్ధిని పొందేందుకు, ఇన్ని కోట్ల మంది భక్తుల మనసుల్లో సందేహాలు లేవనెత్తడం జరిగినప్పుడు.. నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, ఆ తప్పుడు ప్రచారం చేస్తుంటే.. సనాతన ధర్మం గురించి మాట్లాడటం కరెక్టేనా? తప్పు చేసినప్పుడు ఎత్తిచూపకుండా.. గుడ్డిగా సమర్థించడం.. ఎంత వరకూ ధర్మం?. వెంకన్నస్వామితో ఆడుకుంటే వారికి జరగబోయే నష్టం మామూలుగా ఉండదు" అని పవన్ కళ్యాణ్‌ను వైఎస్ జగన్ ప్రశ్నించారు.


చంద్రబాబు తప్పు చేసినట్లు.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, సిట్ రద్దు చేయడం, ఇచ్చిన ఆదేశాల్లోనే కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. తిరుమలలో నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షలు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయన్న వైఎస్ జగన్.. టీటీడీ ఈవోనే స్వయంగా ఆ నెయ్యి వాడలేదని చెప్తున్నారని అన్నారు. ఏమీ జరగలేదని కంటికి కనిపిస్తున్నప్పుడు.. అసలు ఈ విషయంలో సిట్టూ అవసరం లేదు.. బిట్టూ అవసరం లేదంటూ జగన్ అన్నారు. ఏమీ జరగలేదని అన్ని ఆధారాలు ఉన్నప్పుడు.. సిట్ అధికారులు వచ్చి ఏం చేస్తారని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం తప్పుడు రిపోర్టులు తయారు చేస్తే వెంకన్న స్వామే చూసుకుంటారంటూ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com