తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బ తీయడంలో పవన్ కళ్యాణ్ కూడా భాగమయ్యాడని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. అసలు సనాతన ధర్మమంటే పవన్ కళ్యాణ్కు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. ‘తప్పును గుడ్డిగా సమర్థిస్తూ, సనాతన ధర్మమని చెప్పుకోవడం ధర్మమా? ఇది అబద్ధమని తెలిసినా పవన్ కళ్యాణ్.. దానికి రెక్కలు కట్టారు. దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకునే బుద్ధి చంద్రబాబుకు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామితోనే వీళ్లు ఆడుకుంటున్నారు. వాళ్లకు వెంకన్న స్వామే మొట్టికాయలు వేస్తారు’ అని వైఎస్ జగన్ అన్నారు. తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం కోర్టు చెప్పినా.. దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో తిరుమల విశిష్టతను దెబ్బ తీయడమేనా సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.