ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతంలోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. అమరావతి రాజధాని ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని అమరావతి కోసం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు రైల్వే లైన్ కోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపి, నిధులు కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల విషయమై టీడీపీ ఎంపీలు ఆయనతో సమావేశమయ్యారు.


సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అజయ్ కుమార్ జైన్.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని.. విజయవాడ రైల్వే స్టేషన్‌ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అలాగే తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నామన్న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం.. ఏపీలో కొన్ని కిలోమీటర్ల మేరకు కవచ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది 36 కొత్త రైళ్లు ప్రవేశపెట్టామని.. అందులో ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నట్లు వివరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,154 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. మచిలీపట్నం - బాపట్ల - రేపల్లె రైల్వే లైన్ కోసం ప్రతిపాదనలు అందాయన్న రైల్వే జీఎం.. పరిశీలిస్తామని చెప్పారు.


మరోవైపు 56.63 కిలోమీటర్ల మేరకు ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు రైల్వే లైన్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ కొత్త రైల్వే లైన్‌లో మొత్తం 9 రైల్వే స్టేషన్లు ఉండనున్నాయి. పెద్దాపురం, చిన్నరావులపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు స్టేషన్లు ఉండనున్నాయి. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కొత్తపేట, వడ్డమాను మధ్య మూడు కిలోమీటర్ల మేర కృష్ణానది మీద వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2600 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తి జరిగి.. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని ముఖ్య ప్రాంతాలతో అనుసంధానం కలుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com