ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎంల మధ్య " సనాతన ధర్మ" వివాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:06 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతిలో జరిగిన వారాహి సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీద విమర్శలు చేశారు. పేరు ప్రస్తావించకుండానే ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ కళ్యాణ్.. అలా ఎవరైనా ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారని అన్నారు. వ్యక్తులు ఉండొచ్చు, పోవచ్చని.. కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచీ ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా అని, దానిని నిర్మూలిస్తామని కొంతమంది అంటున్నారన్న పవన్ కళ్యాణ్.. ఇలాంటి వారిని ఏం చేయాలంటూ ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని.. చేయాలని ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఉదయనిధి స్టాలిన్‌ను ప్రశ్నించారు. అయితే దీనికి సమాధానం ఇచ్చేందుకు ఉదయనిధి స్టాలిన్ నిరాకరించారు. వెయిట్ అండ్ సీ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ ఇప్పటికే స్పందించింది. డీఎంకే పార్టీ హిందూమతం సహా ఏ మతం గురించి కూడా మాట్లాడదన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా.. అంటరానితనం, సామాజిక అస్పృశ్యత, కులవివక్షపైనే తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్.. మతం, హిందూ దేవతలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వారే నిజమైన శత్రువులంటూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ డీఎంకే అధికార ప్రతినిధి మండిపడ్డారు.


మరోవైపు గతేడాది సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూలాంటిదంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రియాక్టయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పాటుగా దాని మిత్రపక్షమైన డీఎంకేపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ అప్పట్లో మోదీ చెప్పుకొచ్చారు. అయితే తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మ పరిరక్షణ కోసం డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగానే ఉదయనిధి స్టాలిన్ మీద విమర్శలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com