ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. వైసీపీ రియాక్షన్ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:27 PM

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో.. సీబీఐ అధికారులు, రాష్ట్ర పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి బృందంలో ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వైసీపీ స్వాగతించింది. సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. కేవలం దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు చేశారన్న భూమన కరుణాకర్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ న్యాయం చేయదని భావిస్తున్నామని అన్నారు. నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగేదన్న భూమన కరుణాకర్ రెడ్డి.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో నిజాలు బయటకు వస్తాయన్నారు. తిరుమల వెంకన్న ఆశీస్సులతోనే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినట్లు భావిస్తున్నామని అన్నారు. తన ఆలయ ప్రతిష్ఠ భంగం కలిగించే వారిపై స్వామివారే చర్యలు తీసుకుంటారని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సైతం సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామని రోజా అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో రాజకీయ వ్యా్ఖ్యలను అందరూ మానుకుంటే మంచిదని రోజా అన్నారు. తాము మొదటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతున్నామన్నారు రోజా. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని.. కేంద్ర దర్యాప్తు సంస్థ పర్యవేక్షణ ఉండాలని చెప్పిందన్న మంత్రి.. ఈ వాదనతో తమ డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగిందన్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో అసలు నిజాలు బయటకు వస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు మాజీ మంత్రి. అటు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


మరోవైపు తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై టీడీపీ మరోలా స్పందించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. రాష్ట్ర అధికారులతో పాటు సీబీఐ, ఫుడ్ సేఫ్టీ అధికారులుతో కూడిన బృందం దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందనీ.. ఈ దర్యాప్తులో అసలు నిజాలు తేలుతాయని అభిప్రాయపడింది. జగన్ అండ్ కో పాపం పండిందన్న టీడీపీ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కొవ్వు నేతలు విచారణకు సిద్ధంగా ఉండాలని సెటైర్లు వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com