రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే ట్రాక్కు సంబంధించి ఏపీ ఎంపీలు కీలక ప్రకటన చేశారు. రాజధాని అమరావతిని కలుపుతూ త్వరలో రైల్వే ట్రాక్ రాబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్లో ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఆర్వోబీలు, ఆర్యూబీలు అభివృద్ధి చేయాలని కోరామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పెండింగ్లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారన్నారు. మరిన్ని కొత్త రైళ్లు, వందేభారత్ రైళ్లు కావాలని కోరామన్నారు. విజయవాడ నగరంలో డ్రైనేజి సమస్య రైల్వేతో ముడిపడి ఉందన్నారు. రైల్వే , రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు జీఎం అంగీకరించారన్నారు. గత ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేసి ఉంటే విజయవాడకు వరద కష్టాలు ఉండేవి కావన్నారు. ఈ ఐదేళ్లలో రైల్వే పరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.