సజావుగా సాగిపోతున్న కాపురంలో వివాదాలు ముసురుకున్నాయి. పంచాయితీ కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఓ మహిళ పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన ఘటన నగరంలో జరిగింది. ఈ ఘటనలో నాలుగు నెలల చిన్నారి మృతిచెందింది. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గుంటూరులోని శారదా కాలనీలో ఉంటున్న తిరుపతిరావుకు నాలుగేళ్ల క్రితం సుధారాణి(23)తో వివాహం జరిగింది. వారికి జాస్వి, బ్లెసీ అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. జాస్వి వయస్సు 18 నెలలు కాగా, బ్లెసీ వయస్సు నాలుగు నెలలు. తిరుపతిరావు, సుధారాణి దంపతుల మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. తిరుపతిరావు మట్టి పనులు చేస్తుంటాడు.
శనివారం రాత్రి దంపతులిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ విషయం కృష్ణలంక వద్ద కళానగర్లో ఉంటున్న తిరుపతిరావు అన్నయ్య కోటేశ్వరరావుకు తెలిసింది. భార్యభర్తల మధ్య ఉన్న వివాదాన్ని సర్ది చెప్పడానికి వారిని విజయవాడకు పిలిపించారు. ఆదివారం ఉదయం కోటేశ్వరరావు ఊరు వెళ్లాడు. తర్వాత కాసేపటికి తిరుపతిరావు బయటకు వెళ్లాడు. ఆ తర్వాత సుధారాణి తన ఇద్దరి పిల్లలతో కలిసి బెంజిసర్కిల్ వద్ద ఉన్న స్ర్కూబ్రిడ్జి దగ్గరకు చేరుకుంది. అక్కడి నుంచి బందరు కాల్వలోకి దూకేసింది. ఇది గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేశారు. పటమట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, పడవల రేవు వంతెన వద్ద చిన్న కుమార్తె బ్లెసీ మృతదేహం కనిపించగా, సుధారాణి, జాస్వి ఆచూకీ లభించలేదు. వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. కేసును పటమట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.