దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆఫీసుల్లో పని ఒత్తిడితో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండటం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్ సమయం కంటే అధికంగా పనిచేయడం, విరామం లేకుండా పనిచేయడం, తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు.. ఉద్యోగుల ప్రాణాల మీదికి తెస్తోంది. కొందరు పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతుండగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగి రాసిన సూసైడ్ లెటర్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తాను 45 రోజులుగా నిద్రపోకుండా పనిచేశానని.. ఆ పని ఒత్తిడి తట్టుకోలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఉత్తరప్రదేశ్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న తరుణ్ సక్సేనా అనే 42 ఏళ్ల ఉద్యోగి ఇటీవల ప్రాణాలు తీసుకున్నాడు. ఝాన్సీకి చెందిన తరుణ్ సక్సేనా.. ఫైనాన్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తుండగా.. తనపై పై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని.. టార్గెట్లు పెట్టి మానసికంగా వేధించారని తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య లేఖ రాశాడు. ఇచ్చిన పని సమయానికి పూర్తి చేయకపోతే.. జీతం తగ్గించి ఇస్తామని బెదిరించినట్లు పేర్కొన్నాడు. దీంతో ఎలాగైనా పని పూర్తి చేయాలని.. 45 రోజుల పాటు నిద్ర మానుకుని మరీ పని చేసినట్లు వివరించాడు. అంతేకాకుండా తన సమస్య గురించి పై ఉద్యోగులకు చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
చనిపోయే ముందు 5 పేజీల ఆత్మహత్య లేఖ రాసిన తరుణ్ సక్సేనా.. తాను చనిపోవడానికి గల కారణాన్ని భార్యకు వివరించాడు. తనను పై ఉద్యోగులు ఎంతో ఒత్తిడికి గురి చేశారని.. తనను అవమానించడంతో పాటు తీవ్రంగా బెదిరించారని అందులో వెల్లడించాడు. ఈ క్రమంలోనే భవిష్యత్తుపై భయంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఇక తరుణ్ సక్సేనా మృతి గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తరుణ్ సక్సేనా కుటుంబం ఫిర్యాదు చేస్తే.. దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.
ఇక ఇటీవల మహారాష్చ్రలోని పూణేలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే ఛార్టర్డ్ అకౌంటెంట్ మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్లోని లక్నోలో ఓ బ్యాంకు ఉద్యోగిని పనిచేస్తుండగానే ఆఫీస్లోని కుర్చీలో కుప్పకూలి చనిపోయారు. అయితే ఆమె తీవ్ర పని ఒత్తిడితోనే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని మరో ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది.