ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వ కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు,,,, ఛైర్మన్‌గా మంత్రి లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:00 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఎదురయ్యే ఇబ్బందులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వంతో నేరుగా చర్చించేందుకు సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం (సంప్రదింపుల కమిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విజయవాడలో సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) నిర్వహించిన సదరన్‌ రీజినల్‌ కౌన్సిల్‌ సదస్సులో ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కన్సల్టేటివ్‌ ఫోరాన్ని ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులు మంత్రిని కోరారు.


ఈ మేరకు ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం.. మంత్రి లోకేష్ ఛైర్మన్‌గా రెండేళ్ల కాలానికి ఫోరాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫోరంలో.. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు) సీఈవో, సీఐఐ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సీఐఐ భాగస్వామ్యంతో విరివిగా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంతో.. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఏపీఈడీబీ ఏర్పాటును క్రమబద్ధీకరించి.. ఒకే పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది ప్రభుత్వం. పెట్టుబడుల్లో ప్రైవేటు రంగాన్ని కూడా కలుపుకొనేందుకు సీఐఐ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ)తో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుంది. అలాగే ప్రభుత్వశాఖలను ఆర్టీజీఎస్‌ శాఖ సమన్వయం చేయనుంది.


మరోవైపు ఏపీ ప్రజలు తమ సమస్యలపై ప్రతి రోజూ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రజా వేదిక పేరుతో వినతిపత్రాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.. అలాగే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ఫిర్యాదుల్లో కొన్నిటిని నేతలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మిగిలిన వాటికి టీడీపీ గ్రీవెన్స్‌ సెల్‌ స్టాంపు, తేదీ వేసి ఏ రోజు అర్జీల్ని ఆ రోజు సీఎంవోకు పంపిస్తున్నారు. అక్కడ సీఎంవో సిబ్బంది వాటిని పీజీఆర్‌ఎస్‌ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఫిర్యాదుకు గ్రీవెన్స్ నంబర్ కేటాయించి.. ఫిర్యాదు చేసిన వారి మొబైల్‌కు మెసేజ్ పంపిస్తున్నారు. ఇలా చేస్తే ప్రతి ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవచ్చు.


ఈ ఫిర్యాదులపై సీఎంవో సిబ్బంది ఫిర్యాదుల్ని విభజించి సంబంధిత శాఖలకు.. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నారు. ఆ తర్వాత ఆ సమస్యను 30 నుంచి 45 రోజుల్లో పరిష్కరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 60-70% రెవెన్యూశాఖవే ఉంటున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులు గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి ఈపాటికే ఈ సభలు ప్రారంభించాల్సి ఉండగా.. వరదల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com