ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు సాక్ష్యమేంటి? లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 07:52 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సిద్ధార్థ్ లూత్రా, పిటిషనర్ తరుఫున రాజశేఖర్ రావు వాదించారు.


ఇక విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు..? ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్లు ఆధారాలేంటి..? నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు..? లడ్డూలను టెస్ట్ చేశారా..? లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా? అంటూ ప్రశ్నలు కురిపించింది. ఇక ఎన్డీడీబీ రిపోర్టు మీద మైసూర్, ఘజియాబాద్ ల్యాబుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా..? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వం తరుఫు న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణ పూర్తికాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది.


మరోవైపు కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి ట్యాంకర్ అనుమతించలేదని టీటీడీ చెప్తుంటే.. సీఎం ప్రకటన ఎందుకు భిన్నంగా ఉందని సుప్రీంకోర్టు అడిగింది. కల్తీపై క్లారిటీ లేకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ విచారణ జరగకుండానే సీఎం ప్రకటన ఎలా చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం సరిగ్గా విచారణ జరపగలదో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా అంటూ కేంద్రాన్ని అడిగింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ మూడుకి వాయిదా వేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com