ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘ఓం నమో నారాయణాయ’’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించినందుకు గాను కీరవాణికి ఉపముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పవన్ సోమవారం ప్రెస్నోట్ను విడుదల చేశారు. తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.
ఈ ఆవేదన నుంచే ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించినట్లు తెలిపారు. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారన్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారని చెప్పారు. అందుకు అనువుగా కీరవాణి ఆడియో రికార్డు చేశారని.. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకు, సాంకేతిక నిపుణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.