వరద సాయంలో పగలు, రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంధ సంస్ధలు, పారిశుధ్య కార్మికులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది. వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. అయితే బాధితులందరికీ పూర్తిస్థాయిలో వరదసాయం అందాకే ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
దీంతో ఈరోజు విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి రూ. 602 కోట్లు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లలో ఇప్పటివరకు రూ. 569 కోట్లు జమ అయ్యాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్నవారికి ఈరోజు చెల్లింపులు పూర్తి కానున్నాయి.