ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ దేవుడే ధర్మాసనం రూపంలో.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 07:36 PM

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో.. వైసీపీ పార్టీ స్పందించింది. సత్యమేవ జయతే అంటూ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసింది. ఇదే సమయంలో వైసీపీ పార్టీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు. ధర్మాగ్రహాన్ని గుర్తించి.. సుప్రీంకోర్టు ధర్మాసనం సత్యం చెపిందన్నారు. పదవి ఉందని పెదవి జారితే, అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే, భక్త ద్రోహం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందంటూ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు, మహాప్రసాదానికి మలినం అంటగట్టాలని చూస్తే సుప్రీంకోర్టు స్పందించిన తీరును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని అన్నారు.


ఇక తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన దుర్మార్గపు ప్రచారం.. మొత్తం ప్రపంచాన్ని కలిచివేసిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో హిందూ సమాజంలో భయానక వాతావరణం ఏర్పడిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయించినట్లు భావిస్తున్నామన్నారు. దేవుణ్ని రాజకీయాల్లోకి లాగవద్దని మేము చెప్పినా వినకుండా..సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటుసారా తాగిన వ్యక్తి మాట్లాడినట్లు మాట్లాడిన మాటలు బాధించాయన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సరిగా స్పందించిందన్న భూమన.. వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.


టీటీడీ ఈవో చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు జంతువులు కొవ్వు వాడారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ విషయంలో తప్పు జరిగింది అంటూ విషప్రచారం చేశారని.. మహా ప్రసాదం, మహామాలిన్యం అయింది అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. వెంకన్న స్వామి ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా లడ్డు ప్రసాదం విషయంలో అసత్యాలు ప్రచారం చేశారని భూమన ఆరోపించారు.నిజం ఎప్పటికైనా గెలుస్తుందని,. తప్ప చేయలేదు కాబట్టే దైర్యం మేము విచారణ కోరామని భూమన అన్నారు. స్వామి వారి వైభవాన్ని తగ్గించే విధంగా చంద్రబాబు, పవన్ మాట్లాడు‌తున్నారన్న భూమన కరుణాకర్ రెడ్డి.. హిందూ సమాజం వారిని ఛీకొడుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com