తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అఖిలపక్షం భేటీకి హాజరు కాబోనని, ఇంత తక్కువ సమయంలో హాజరు కావడం ఎలా కుదురుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు కు బహిరంగ లేఖ రాసారు… అంతేకాకుండా సరైన అజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో మీరు సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. కానీ తరువాత రోజే సమావేశం ఏర్పాటు చేసుకొని, ముందు రోజే ఇలా ఆహ్వానం పంపడం వలన నేను రాలేకపోతున్నాను, అని పవన్ కళ్యాణ్ లేఖ లో పూర్తిగా వెల్లడించారు.
కానీ ఈ సమాధానం వెనకాల వేరే రచ్చ జరుగుతుందనే చర్చ జరుగుతుంది. పవన్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడానికి బలమైన కారణాలున్నాయని, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర పూరితంగానే పవన్ హాజరు కాలేదని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు జనసేనతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు పవన్ ఈ సమావేశానికి హాజరైతే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసినట్లవుతుందనే ఆలోచనతో జనసేన అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.