ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జిల్లా కోడ్ గా ఉండేవి. కానీ ఏపీలో ఇక నుంచి అలా ఉండదు. ఏపీ రవాణా శాఖ ‘ఒక రాష్ట్రం-ఒక సీరిస్’ పేరిట వాహనాలకు నెంబర్లు కేటాయించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానాన్ని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు.
ఇక నుంచి వాహనాలకు జిల్లా కో నెంబర్ కాకుండా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు ఏపీ 39 సీరిస్ తో నెంబర్లు కేటాయిస్తారు. ఆర్టీసీ వాహనాలకు ఏపీ 39జడ్ పోలీస్ వాహనాలకు ఏపీ 39పీ రవాణా వాహనాలకు ఏపీ 39టీ యూ వీ డబ్ల్యూ ఎక్స్ వై సీరీస్ లను కేటాయించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని వాహనాలకు ఒకే సీరిస్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రవాణా శాఖ సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు సాఫ్ట్ వేర్ ను రూపొందించి 58 రోజుల్లోనే అన్నిరకాల సేవలు ఆన్ లైన్ లోకి తెచ్చామని రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. వాహనం కొన్న వారికి ఇదివరకు పర్మినెంట్ నెంబర్ రావడానికి రెండు నెలల సమయం పట్టేదని ఇప్పుడు వాహనం కొన్న వెంటనే షోరూమ్ లోని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. రవాణా శాఖ నుంచి నిర్వహించే 83 సేవల్లో 70రకాల సేవలు ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. నేటి నుంచి అన్నీ ఆర్టీఏ ఆఫీసుల్లో ఈ విధానం అమల్లోకి రానుందని ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ కొత్త నెంబర్ సీరిస్ విధానం వాహనదారులకు ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి .