ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీసీఐ రూ.125 కోట్లలో ఒక్కో ఆటగాడికి ఎంతంటే?.. పంపకాలు ఇలా

sports |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 10:05 PM

17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టోర్నీ ముగిసిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ ప్రకటన చేశారు. కానీ జట్టుకు రూ.125 కోట్లు ఇస్తామని మాత్రమే జైషా చెప్పాడు. దీంతో ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఎంత మొత్తం దక్కుతుందనే విషయంపై.. ఇన్నాళ్లు సందిగ్ధత కొనసాగింది. అయితే తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు ఎవరికి ఎంత మొత్తంలో ఇవ్వాలో ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం.. ఆ పంపకాలు ఇలా ఉన్నాయి..ఈ టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ 15 మందికి ప్రధాన జట్టులో చోటు కల్పించింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు. అయితే బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్‌మనీలో ఈ 15 మందికి ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున దక్కనుంది. యుజ్వేంద్ర చాహల్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్‌లు ఒక్క మ్యాచ్ కూడా ఆడనప్పటికీ వారు కూడా రూ.5 కోట్లు అందుకోనున్నారు. వీరితో పాటు టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌ సైతం రూ.5 కోట్లు అందుకోనున్నాడు.


బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కౌచ్ పరాస్ మాంబ్రేలు రూ.2.5 కోట్ల చొప్పున అందుకుంటారు. సహాయక సిబ్బందితోని ముగ్గురు ఫిజియో థెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లకు రూ.2 కోట్ల చొప్పున దక్కనంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం జట్టున ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ సభ్యులకు సైతం నగదు బహుమతి అందనుంది. చీఫ్ సెలక్టర్ అజిత అగార్క్ సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున అందుకుంటారు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు రూ.కోటి చొప్పున అందుకోనున్నారు.


టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు:


రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌


రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com