ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ నోట కడప ఉప ఎన్నికల మాట.. షర్మిల కోసం గల్లీ గల్లీ తిరుగుతానన్న తెలంగాణ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 10:04 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలపై కీలక తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్‌ రెడ్డితో పాటుగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాలపైనా, కడప లోక్ సభ ఉపఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.


కడప లోక్ సభ ఉపఎన్నికలకు సంబంధించి ఈ మధ్య సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని.. కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీకి వెళ్లే ఇష్టం లేక వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక జగన్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని.. అన్నయ్య స్థానంలో పులివెందుల నుంచి బరిలో ఉంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే కడప లోక్ సభ ఉపఎన్నికలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.


ఏపీలో బీజేపీ పాలన సాగుతోందన్న రేవంత్ రెడ్డి.. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఏపీలో అన్నీ పాలక పార్టీలే ఉన్నాయన్న రేవంత్ రెడ్డి.. ప్రజల తరుఫున కొట్లాడే విపక్షం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైఎస్ షర్మిల కూడా పుంజుకుని.. 2029 నాటికి ఏపీకి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో ఈ మధ్య కడప లోక్ సభ ఎన్నికల గురించి వార్తలు వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి.. ఒకవేళ కడప పార్లమెంట్‌కు ఉపఎన్నికలు జరిగితే వైఎస్ షర్మిల తరుఫున తాను ప్రచారం చేస్తానని ప్రకటించారు. వైఎస్ షర్మిల విజయం కోసం కడప లోక్ సభ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తానంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


అభివృద్ధి, సంక్షేమం అంటే వైఎస్ఆర్ గుర్తుకువస్తారన్న రేవంత్ రెడ్డి.. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులకు కొదువ లేదన్నారు. ఇక కేంద్రంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలనేదే వైఎస్ఆర్ ఆఖరి కోరికగా చెప్పిన రేవంత్ రెడ్డి.. కేంద్రంలో రాహుల్, ఏపీలో షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com