గరుగుబిల్లి మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు చేపట్టాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 1970లో శివ్వాం గ్రామానికి చెందిన 14 మంది సుమారు 25 ఎకరాల భూమికి పట్టాలు పొందారన్నారు. పట్టాల మేరకు కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. అయితే భూముల్లో ఉన్న వారిపై గురువారం ఆయుధాలతో దాడి చేయడం విచారకరం అన్నారు. సుమారు 9 మంది పెత్తందారులు దాడులకు పాల్పడ్డారని, వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులు సాగు చేసుకుంటున్న భూమిని దురాక్రమణ చేయడానికి పలువురు పన్నాగాలు చేస్తున్నారన్నారు. ఎస్సీ కులానికి చెందిన రేగిడి దుర్గపై దాడులు చేశారని చెప్పారు. అధికారులు స్పందించి దళితులను ఆదుకోవాలని ఆయన కోరారు.