ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెజవాడ దుర్గమ్మకు మంగళసూత్రం చేయించిన సామాన్య భక్తుడు.. రూపాయి, రూపాయి కూడబెట్టి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:55 PM

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఓ సామాన్య భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెడుతూ.. పోగు చేసిన సొమ్ముతో 203 గ్రాముల బంగారం కొని అమ్మవారికి మంగళసూత్రం తయారుచేయించి తీసుకొచ్చాడు. ఆ హారం విలువ రూ. 16.50 లక్షల విలువ ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అమ్మవారి భక్తుడైన అంకులయ్యా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేల తన కానుకను సమర్పించి మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి శనివారం (అక్టోబర్ 5) దుర్గగుడికి వచ్చి మంగళసూత్రాలను ఆలయ ఈవోకి అందజేశారు.


ప్రకాశం జిల్లా కొండెపి మండల కేంద్రానికి చెందిన కళ్లకుంట అంకులయ్య, రాజేశ్వరి దంపతులు కొబ్బరిబోండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ సంపాదనలో రోజూ కొంత దాచుకున్నారు. అలా పోగైన సొమ్ముతూ అప్పుడప్పుడూ కొంత బంగారాన్ని తీసుకున్నారు. అలా సమీకరించిన 203 గ్రాముల బంగారంతో అమ్మవారికి మంగళసూత్రాలు చేయించారు. ఆ మంగళసూత్రం చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని అంకులయ్య తెలిపారు.


‘ఇది (మంగళసూత్రం) అమ్మవారి మెడలో వేస్తే చాలు. నా జన్మ ధన్యమైపోతుంది. ఇక అంతకంటే ఏమీ వద్దు. అమ్మవారి మెడలో వేశాక నా కళ్లతో చూడాలని ఉంది. అంతకంటే ఆనందం నాకు ఏం కావాలి సార్? ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు సార్. అమ్మవారి మెడలో ఈ ఆభరణాన్ని వేశాక, నా కళ్లతో చూసిన తర్వాత అప్పుడు మంచినీళ్లు తాగుతా..’ అని అంకులయ్య అన్నారు.


‘ఎన్ని రోజుల నుంచో ఉన్న మొక్కుబడి సార్. ఈ మొక్కుబడి కోసం రూపాయి రూపాయి కూడబెట్టి అమ్మవారికి 203 గ్రాముల బంగారంతో చేయించా’ అని అంకులయ్య తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండెపి నియోజకవర్గ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి (టీడీపీ) చేతుల మీదుగా దుర్గా అమ్మవారికి ఆ కానుకను అందజేయాలనుకున్నానని.. అనుకోకుండా మంత్రిగారు రాలేకపోయారని అంకులయ్య చెప్పారు. అయితే, ఆయన బావమరిదిని పంపించారని తెలిపారు. తన తల్లిదండ్రులు రమణయ్య, తిరుపతమ్మ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కనకదుర్గ అమ్మవారికి మంగళసూత్రం సమర్పించారు.


గుంటూరు చెందిన మరో భక్తుడు.. అమ్మవారికి 6 కిలోల వెండి హంసను సమర్పించారు. ఈ వెండి హంస విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ సిబ్బంది వెల్లడించారు. నవరాత్రుల్లో తొలి రోజైన గురువారం అమ్మవారికి ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు ఆభరణాలను సమర్పించారు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ రూ. 3 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని సమర్పించారు.


దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం జగన్మాత.. అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్త జనకోటికి దర్శనం ఇచ్చారు. వేకువజామునుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చారు. భక్తులతో అర్చకులు కుంకుమార్చనలు చేయించారు. అయితే, వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 500 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలైన్లను కూడా గంటల తరబడి నిలిపివేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com