వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో ఉద్యోగులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హెచ్చరించారు. ఆయన గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఎంపీడీవోలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీంపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ 4 వేలు పెంపుదల చేస్తున్నట్లు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం జరిగిందన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెరిగిన అదనపు వెయ్యి రూపాయలను కలుపుకొని మూడు నెలలకు సంబంధించి రూ.3వేలు పెంచిన పెన్షన్ రూ.4వేలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేలు సచివాలయ సిబ్బంది స్వయంగా పెన్షన్దారునకు అందించాలన్నారు. పెన్షన్ పంపిణీ నిమిత్తంగా ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. రానున్న బడ్జెట్ సమావేశాలు అనంతరం అభివృద్ధి కార్యక్రమాల విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపట్టేందుకు త్వరలో అన్నిశాఖల ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆనందబాబు పేర్కొన్నారు.