వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఎమ్మెల్యే కడపలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కోరడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ప్రతి పక్ష హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన జగన్కు భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యంగం రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు.ప్రజల దగ్గరకు వెళ్లి మొఖం చూపించుకోలేక జగన్ రెడ్డి కుయుక్తులకు తెరలేపారని, స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ నేతలు ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదని మాధవి రెడ్డి విమర్శించారు. ఆరుగురు టీడీపీ శాసన సభ్యులను పీకేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని జగన్ అన్న మాటలు మరిచిపోయారా? అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయితేనే జగన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తారా?.. ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ?.. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు మీకు పట్టవా?.. అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇకనైనా జగన్ అధికార భ్రాంతి నుంచి బయటకు రావాలన్నారు. జగన్ పాలనలో నష్టపోని వ్యక్తి లేరని, అందుకే సొంత నియోజకవర్గంలో కూడా జగన్ రెడ్డిపై రాళ్లు విసిరారని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇప్పుడు ప్రతిపక్షం అంటూ కొత్తనాటకాలకు తెరలేపారని ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు.