ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేలు వేసిన మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 10:03 PM

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. రైతులకు పంట సాయం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాల్ని అందించింది. ఈ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు ఏటా పంట సాయం పేరిట రూ. 6 వేలు అకౌంట్లో వేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని 3 విడతల్లో.. ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున అందిస్తుంది. ఇప్పటివరకు 17 విడతల్లో రైతులు డబ్బులు అందుకోగా.. 18 వ విడత కింద నిధుల్ని శనివారం (అక్టోబర్ 5న) విడుదల చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్ర వాషిమ్ పర్యటనలో ఉన్న ప్రధాని.. అక్కడే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని రిమోట్ బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేశారు.


18వ విడత కింద దాదాపు 9.40 కోట్ల మందికిపైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరి అకౌంట్లలోకి డైరెక్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలోనే డబ్బుల్ని జమ చేసింది. ఇక్కడ ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండదు. రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వచ్చి పడతాయని చెప్పొచ్చు.


ఇప్పటివరకు 18 విడతల్లో నిధుల్ని విడుదల చేయగా.. స్కీమ్ ప్రారంభించిన 2019 నుంచి చూస్తే మొత్తంగా ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 3.45 లక్షల కోట్లకుపైగా అర్హులైన రైతుల అకౌంట్లలో డబ్బులు వచ్చి చేరాయి. దాదాపు 11 కోట్ల మందికిపైగా రైతులు ప్రయోజనం పొందారు. చివరిసారిగా 17వ విడత నిధుల్ని మోదీ.. 2024, జూన్ 18న విడుదల చేశారు. అప్పుడు 9.30 కోట్లమందికిపైగా రైతులు అర్హులుకాగా.. రూ. 20 వేల కోట్లకుపైగా నగదు వారి అకౌంట్లలోకి చేరింది. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదల దస్త్రంపైనే చేశారు.


లబ్ధిదారుల స్టేటస్ తెలుసుకునేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అక్కడ వ్యూ బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేస్తే.. పేమెంట్ స్టేటస్ అక్కడే తెలుసుకోవచ్చు.


పీఎం కిసాన్ పథకం కింద డబ్బుల్ని పొందాలంటే కచ్చితంగా ఇ- కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది ఓటీపీ బేస్డ్ కేవైసీని పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా చేసుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు. చివరగా పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు.


పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయడంతో రైతులు ఇందుకు సంబంధించిన వార్తలను ఎక్కువగా చూస్తున్నారు. తమ బ్యాంక్ ఖాతాల స్టేట్‌మెంట్లను చెక్ చేసుకుంటున్నారు. పీఎం కిసాన్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. జార్ఖండ్, ఒడిశా, అస్సాం, ఉత్తర్ ప్రదేశ్, నాగాలాండ్‌లో పీఎం కిసాన్ నిధుల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com