ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు.. తొలిసారి ఓటేసిన మను బాకర్, తరలివచ్చిన ప్రముఖులు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:58 PM

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో తెల్లవారుజాము నుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ప్రముఖులు కూడా వచ్చి ఓటు వేస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానుండగా.. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక అదే రోజు.. 3 విడతలుగా జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఇక ఉదయం 11 గంటల వరకు 12.5 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


మొత్తం 90 సీట్లకు గాను మొత్తం 1031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 20,632 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2 కోట్ల మందికి పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హర్యానా చిన్న రాష్ట్రమే అయినా.. దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. గత 10 ఏళ్లుగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి.. హ్యాట్రిక్‌ కొట్టాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు.. ఆ పార్టీని తీవ్రంగా భయపెడుతున్నాయి. మహిళలు 101 మంది పోటీ చేస్తుండగా.. స్వతంత్రంగా 464 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,03,54,350 కాగా.. వారిలో పురుషులు 1,07,75,957.. మహిళలు 95,77,926 ఉన్నారు. 467 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కు వినియోగించనున్నారు.


ఇక ఈ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మాజీ రెజ్లర్‌, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వినేష్ ఫోగట్‌ ఓటు వేశారు. చక్రి దాద్రిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన వినేష్ ఫోగట్.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక భారత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్‌ హిస్సార్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ రెజ్లర్‌, బీజేపీ నేత యోగేష్ దత్‌, బబిత ఫోగట్‌ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ఇక ఇటీవలి పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ షూటర్‌ మను బాకర్.. తొలిసారి ఓటు వేశారు. ఝజ్జర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఉదయమే ఓటు వేసిన మను బాకర్.. ప్రజాస్వామ్య పండగలో పాల్గొనాలని యువతకు సూచించారు. తాను ఓటు వేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్న మను బాకర్.. చిన్న అడుగులే పెద్ద లక్ష్యాలను చేరుకుంటాయని పేర్కొన్నారు. అంతేకాకుకండా దేశ యువతగా ఓటు వేయడం మనందరి బాధ్యత అని.. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com