ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కంపెనీలో వాటా అమ్మేసిన రతన్ టాటా.. 23 వేల శాతం లాభాలతో

business |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 10:05 PM

భారత దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్‌ను ఉన్నత స్థాయికి చేర్చిన సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా.. ప్రముఖ బ్రోకరేజీ ప్లాట్‌ఫాం అప్‌స్టాక్స్‌లో మైనార్టీ వాటాను విక్రయించారు. సుమారు 0.06 శాతం తన వాటాను.. సంస్థ షేర్ల బైబ్యాక్ సందర్భంగా అమ్మేయగా.. దాదాపు 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 18 కోట్ల వరకు) ఆర్జించారు. ఇది రతన్ టాటా పెట్టిన వాస్తవ పెట్టుబడిపై దాదాపు 23 వేల శాతం రాబడి అందించినట్లు అప్‌స్టాక్స్ పేర్కొంది. 2022 లో అప్‌స్టాక్స్ విలువ రూ. 3.5 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి.. రతన్ టాటా రాబడిని అంచనా వేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం రోజు అప్‌స్టాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అప్‌స్టాక్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 8 సంవత్సరాల తర్వాత టాటా.. తొలి ట్రాన్సాక్షన్ జరిపారు.


2016లో టాటా.. అప్‌స్టాక్స్ స్టార్టప్‌లో సుమారు 1.33 శాతం వాటాను కొనుగోలు చేశారు. అప్పట్లో దాదాపు రూ. 1.67 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఈ విలువ రూ. 390 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీంట్లో సుమారు 5 శాతం అంటే 0.06 శాతం వాటాను విక్రయించగా.. మరో 95 శాతం వాటాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో.. రతన్ టాటా తమ కంపెనీపై ఉంచిన విశ్వాసానికి ఇది ప్రతీక అని అప్‌స్టాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.


దేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్దది టాటా గ్రూప్. దీనిని విజయవంతంగా దశాబ్దాలుగా నడిపించి ముందుకు తీసుకెళ్లిన ఘనత ప్రధానంగా రతన్ టాటాకే చెల్లుతుందని చెప్పొచ్చు. ఇక ఆ సంస్థల ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రతన్ టాటా ప్రస్తుతం చారిటబుల్ ట్రస్టులకు మాత్రం నాయకత్వం వహిస్తూ.. ఈ క్రమంలోనే చిన్న చిన్న సంస్థల్ని ముఖ్యంగా స్టార్టప్స్ (అంకుర సంస్థలు) ను ప్రోత్సహిస్తూ.. వాటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు.


రతన్ టాటా పెట్టుబడులు పెట్టిన ఎన్నో స్టార్టప్స్ కూడా క్రమంగా తమ విలువను పెంచుకుంటున్నాయి. ఇంకా ఆ కంపెనీల విలువ పెరిగిన తర్వాత.. టాటా వాటిల్లో నుంచి తమ వాటాను మెల్లగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అంతకుముందు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన బేబీ కేర్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్‌క్రై లోనూ గతంలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టి.. కొన్నాళ్ల తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అప్‌స్టాక్స్ కూడా త్వరలో పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇందులోనూ పూర్తి వాటా ఉపసంహరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com