వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రత్యేక కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 18నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిందని, రెండేళ్ల లోపు శిక్ష అయినందున తోటకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులు లేవని అనుచరులు చెబుతున్నారు. తాను ఎన్నికల బరిలోనే ఉంటానంటూ తోట కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అట్రాసిటీ చట్టం కంటే ముందు 1955లో ప్రవేశపెట్టిన ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్(పీసీఆర్) ప్రకారం అంటరానితనం నేరానికి సంబంధించిన సెక్షన్లలో జరిమానా, కనీస శిక్ష పడినా ఎన్నికల్లో పోటీకి అనర్హులే. దీని ప్రకారం తోటపై వేటు వేయాలంటూ దళిత సంఘాలు, పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నాయి.