కాకినాడ లో ఘోరం జరిగింది. మనస్తాపానికి గురై యువకుడు ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళ్ళితే... జగన్నాథపురం చిక్కాల వారి వీధికి చెందిన పోతాబత్తుల వెంకట సుబ్రహ్మణ్యం(16) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ విద్యనభ్యసిస్తున్నాడు. ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం ప్రకటించిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో వెంకట సుబ్రహ్మణ్యం ఫెయిల్ అయ్యాడు. ఇంటర్ మొదటి ఏడాదిలో ఓ సబ్జెక్ట్, ద్వితీయ సంవత్సరంలో 4 సబ్జెక్టులు ఉండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. బుధవారం ఇంటినుంచి బయటకు కెళ్లిన సుబ్రహ్మణ్యం రాత్రికి ఇంటికి రాలేదు. తండ్రి వెంకటరత్నం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఫలితం లేకపోవడంతో స్థానిక కాకినాడ పోలీస్స్టేషన్లో కుమారుడి అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రానికి కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ సముద్రతీరానికి గుర్తు తెలియని బాలుడు మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి తిమ్మాపురం ఎస్ఐ కె.నాగార్జునరాజు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి తొలుత గుర్తుతెలియని మృతదేహంగా నిర్ధారించారు. మిస్సింగ్ కేసుగా కాకినాడలో నమోదైన వివరాలు సరిచూసిన తర్వాత అదృశ్యమైన విద్యార్థి పోతాబత్తుల వెంకట సుబ్రహ్మణ్యంగా కుటుంబసభ్యుల సమాచారం మేరకు నిర్ధారించినట్లు ఎస్ఐ నాగార్జునరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించామన్నారు. బాగా చదువుకుని జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటాడనుకున్న కుమారుడు ఇలా అర్ధాంతరంగా సముద్రంలో పడి ఆత్మహత్యకు పాల్పడతాడని కలలో కూడా అనుకోలేదని తల్లిదండ్రులు వెంకటరత్నం దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్ష తప్పినా తాము ఏమీ అనలేదని, ఇలా ఎందుకు చేసుకున్నాడో అని వాపోయారు.