భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 2. 63కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించానని తెలిపారు. నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. మన్సూరాబాద్ డివిజన్ లో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని, డివిజన్ హయత్ నగర్ పరిధిలో సుమారు 15 కిలో మీటర్ల మేర నూతన మంచినీటి పైప్ లైన్లు వేశామని, మరో 10కిలో మీటర్ల పనులు జరుగుతున్నాయన్నారు. వర్షపు నీరు కాలనీల్లో చేరకుండా క్రీడా నుంచి హతిగూడ చెరువు వరకు వరద కాలువ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపడతామన్నారు.
మంచినీరు, డ్రైనేజీ ఏర్పాటు చేశాకే సీసీ రోడ్డు పనులు చేపడతామన్నారు. బాలాజీనగర్ నుంచి హతిగూడ చెరువు మీదుగా ప్రత్యేక డ్రైనేజీ ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరే టర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, నాయకులు జగదీష్ యాదవ్, టంగుగూరి నాగరాజు, రఘువీర్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, కాలనీవాసులు కరణం శ్రీకాంత్, వల్లూరిపల్లి పార్థ సారథి, జగత్ రెడ్డి , రఘు, సత్యనారాయణ, సాయి లుగౌడ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.