ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ హాస్టల్‌లో 21 మంది బాలికలపై లైంగిక దాడి.. వార్డెన్‌కు మరణ శిక్ష

national |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 09:58 PM

2022లో అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన దారుణమైన లైంగిక దాడి ఘటనలో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించింది. రెసిడెన్షియల్ పాఠశాలలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేసే వ్యక్తి.. ఆ హాస్టల్‌లో ఉండే బాలికలపై కన్నేశాడు. ఈ క్రమంలోనే సమయం దొరికినప్పుడల్లా వారిపై లైంగిక దాడి చేసినట్లు తేలింది. అయితే ఇద్దరు కవలలు.. ఈ విషయాన్ని తండ్రికి తెలపగా.. ఆయన ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 21 మంది చిన్నారులపై ఆ హాస్టల్ వార్డెన్ లైంగిక దాడి చేయగా.. అందులో బాలురు కూడా ఉండటం సంచలనంగా మారింది.


అరుణాచల్ ప్రదేశ్‌లోని షీ యోమీ జిల్లాలోని మోనిగోంగ్ పోలీస్ స్టేషన్‌లో 2022 నవంబర్‌లో ఒక కేసు ఫైల్ అయింది. స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివే 12 ఏళ్ల ఇద్దరు కవలలు.. హాస్టల్ వార్డెన్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని తండ్రికి చెప్పారు. దీంతో ఆ హాస్టల్ వార్డెన్‌ యుమ్కెన్ బాగ్రాపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రెసిడెన్షియల్ హాస్టల్‌లో విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఇద్దరు కవలలతోనే కాకుండా హాస్టల్‌లో ఉండే ఇతర బాలికలపై ఆ వార్డెన్ లైంగిక దాడి చేసినట్లు గుర్తించారు.


 అంతేకాకుండా 2014 నుంచి 2022 వరకు మొత్తం 21మంది బాలికలపై అతడు లైంగిక దాడులు, వేధింపులు పాల్పడినట్లు గుర్తించారు. ఇక అందులో ఆరుగురు బాలురు కూడా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఆ బాలుర వయసు కూడా 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడు యుమ్కెన్ బాగ్రాపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. మరో ఇద్దరిపైనా అభియోగాలు మోపారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్ మాజీ ప్రిన్సిపల్, హిందీ మహిళా టీచర్‌‌లపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. తాజాగా పోక్సో స్పెషల్ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో యుమ్కెన్ బాగ్రాను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది. అంతేకాకుండా అతడికి సహకరించిన మరో ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్షను తాజాగా ఖరారు చేసింది.


ఇక ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేయగా.. గతేడాది జులైలో సిట్ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. బాలికలపై లైంగిక దాడికి పాల్పడేముందు వారికి వార్డెన్‌ మత్తుమందు ఇచ్చేవాడని తేల్చారు. ఇక ఈ లైంగిక దాడికి సంబంధించిన విషయాలను ఎవరికీ చెప్పవద్దని వారిని బెదిరించేవాడని గుర్తించారు. ఈ క్రమంలో ఆరుగురు బాలికలు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారని తేలింది. అయితే వార్డెన్‌ అకృత్యాల గురించి ఓ మహిళా టీచర్‌కు బాధిత చిన్నారులు చెప్పినప్పటికీ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని వెల్లడైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com