ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎం ఆఫీస్‌పై మహిళ దాడి.. నేమ్ బోర్డ్‌ పీకేసి, పూలకుండీలు ధ్వంసం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 09:57 PM

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఓ దుండగురాలు హల్‌చల్ చేసింది. ఎంట్రీ పాస్ లేకుండానే డిప్యూటీ సీఎం ఆఫీస్‌లోకి వెళ్లినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె పెద్ద రణరంగమే సృష్టించింది. ఆ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని ఉన్న నేమ్ బోర్డ్‌ను తీసి కింద పడేసింది. అంతే కాకుండా ఆ ప్రాంతం మొత్తం ధ్వంసం చేసింది. ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పూల కుండీలను తీసి పగుల గొట్టింది. దీంతో ఆ ఆఫీస్‌లో మొత్తం మట్టి పడింది. నానా రచ్చ చేసిన తర్వాత.. సైలెంట్‌గా ఆ మహిళ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో ఆమె ఎవరు అని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.


ముంబైలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం కూడా సాయంత్రం వర్షం పడింది. ఇక నగరంలోని మంత్రాలయ ప్రాంలో ఉన్న ఈ భవనంలోని ఆరో అంతస్తులో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఉంది. ఇందులో భాగంగానే ఆ కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ మహిళ అక్కడ వీరంగం సృష్టించింది. డిప్యూటీ సీఎం ఆఫీస్‌లో పనిచేసే సిబ్బంది ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ మహిళ చేసిన ప్రయత్నం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. గుర్తు తెలియని మహిళ.. అక్కడికి చేరుకుని దేవేంద్ర ఫడ్నవీస్ నేమ్ ప్లేట్ తీసి విసిరేసింది. కార్యాలయంలోకి ప్రవేశించి కేకలు వేయడం ప్రారంభించడంతోపాటు.. అక్కడ ఉంచిన కొన్ని పూల కుండీలను కూడా పగులగొట్టింది. కుండీల్లో ఉంచిన మట్టిని కూడా వెదజల్లింది.


ఇక దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫీస్‌లో ఆ మహిళ చేసిన రచ్చకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. టీషర్ట్, ప్యాంట్ వేసుకున్న మహిళ.. చేతిలో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని డిప్యూటీ సీఎం కార్యాలయంలో హంగామా చేసింది. అంత సెక్యూరిటీ ఉన్న డిప్యూటీ సీఎం ఆఫీస్‌లోకి ఆ మహిళ ఎలా ప్రవేశించింది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అయితే ఆమె అక్కడ అంత రచ్చ చేస్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోనే భద్రంగా లేకుంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


ఈ ఘటనను పోలీసులు, అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫీస్‌లో హంగామా సృష్టించిన మహిళను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం కార్యాలయం వెలుపల కూడా భద్రతను భారీగా పెంచారు. మరో 2 నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి బిజీ బిజీగా ఉండగా.. ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఆఫీస్‌పై దాడి జరిగిన సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయంలో ఉన్నారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com