ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెబనాన్‌లో కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదన తిరస్కరించిన ఇజ్రాయేల్

international |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 10:21 PM

ఇజ్రాయేల్, హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్, సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నం విఫలమైంది. 21 రోజుల కాల్పుల విరమణపై అమెరికా ప్రతిపాదనను ఇజ్రాయేల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తోసిపుచ్చారు. తమ లక్ష్యాన్ని సాధించేవరకు హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఆయన గురువారం తేల్చిచెప్పారు. లెబనాన్‌పై పూర్తిస్థాయిలో దాడులు చేపట్టాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై మాటల్లేవని, మా చర్యలతోనే బదులిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. ఉత్తర సరిహద్దుల్లోని ఇళ్లను వదిలి వెళ్లిన మా ప్రజలు తిరిగి రావడమే మాకు ముఖ్యమని ఉద్ఘాటించారు.


‘మాకు ఎలాంటి గందరగోళం లేదు.. ఇజ్రాయేల్‌ విధానం సుస్పష్టం.. మేం మా లక్ష్యాలను సాధించేవరకు దాడులు ఆగవు.. హెజ్బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయేల్‌ను వీడిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడం మాకు కీలకం’ అని నెతన్యాహు అన్నారు. కాగా, గురువారం ఇజ్రాయేల్‌ దాడిలో హెజ్బొల్లాకు చెందిన డ్రోన్‌ యూనిట్‌ కమాండర్‌ ముహమ్మూద్ హుస్సైని స్రూర్ హతమయ్యాడు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని దాహియాలో ఈ కమాండర్‌ ఉన్న భవంతిపై ఇజ్రాయేల్‌ మూడు క్షిపణులను ప్రయోగించింది. వారం రోజుల్లో దాహియాపై ఇజ్రాయెల్‌ చేసిన నాలుగో దాడి ఇది.


హెజ్బొల్లాకు చెందిన దాదాపు 17 మంది సీనియర్‌ కమాండర్లను ఈ ప్రాంతంలోనే ఇజ్రాయేల్‌ హతమార్చడం గమనార్హం. హెజ్బొల్లా డ్రోన్ కమాండర్ హుస్సైని స్రూర్‌ను తమ యుద్ధ విమానాలు టార్గెట్ చేసి, హతమార్చినట్టు ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. మీడియా నివేదికల ప్రకారం.. 1973లో జన్మించిన స్రూర్.. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇవ్వడానికి హెజ్బొల్లా పంపిన ముఖ్య కమాండోల్లో ఒకరు.


బుధవారం రాత్రి లెబనాన్‌లోని బెకా లోయపై ఐడీఎఫ్‌ చేసిన దాడుల్లో 23 మంది సిరియన్లు మృతి చెందారు. మరోవైపు, గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం సమీపంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయేల్‌ జరిపిన వైమానిక దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. మరోవైపు, వారం రోజులుగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయేల్ జరుపుతోన్న దాడుల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో గాయపడగా.. 1,18,000 మంది నిరాశ్రయులుగా మారారు.


ఇక, 21 రోజుల కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్‌తో పాటు జపాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ నేతలు సంయుక్త ప్రకటన చేశారు. లెబనాన్‌లో పరిస్థితి దారుణంగా మారుతోంది.. ఇజ్రాయేల్ లేదా లెబనాన్ ప్రజలకు ఎవరికీ హింసపై ఆసక్తి లేదు’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com