కర్ణాటక ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సోమవారంతో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఈ నెల నుంచి తెలంగాణ బీజేపీపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టనుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సిద్దవుతున్నారు. ఈ క్రమంలో త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్లో టెక్స్టైల్ పార్కు ప్రారంభానికి మోదీ ఈ నెలలో రానున్నారని సమాచారం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలలోనే రాష్ట్ర పర్యటనకు రానున్నారని కాషాయ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల తొలివారంలో రాష్ట్ర పర్యటనకు రానుండగా.. త్వరలో జేపీ నడ్డా పర్యటన ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో జేపీ నడ్డా పర్యటిస్తారనే ప్రచారం సాగుతోంది.
గత నెలలో రాష్ట్ర పర్యటనలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వచ్చారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్ధాపన చేశారు. అలాగే మరిన్ని ఎంఎంటీస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత గత నెల 23వ తేదీన తెలంగాణ పర్యటనకు అమిత్ షా వచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా ఈ సభలో చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ నెలలో రాష్ట్ర పర్యటనకు అమిత్ షా వచ్చే అవకాశముంది.
నెలకు ఒకసారి రాష్ట్ర పర్యటనకు వస్తానని గతంలో తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా వచ్చారు. అందుకు తగ్గట్లుగానే ప్రతి నెలా అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇక జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్ర పర్యటనలకు తరచుగా వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.