జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో మండల కమిటీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణకు ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉన్నత కులాలు ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అంటూ ఏ ఇతర కులాలతో చర్చలు జరపకుండా ఏక పక్షంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో 7శాతం జనాభాకు 10శాతం రిజర్వేషన్ ఇవ్వగలిగినపుడు ఎన్నో ఉద్యమాలు చెప్పట్టినప్పటికి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఎన్నో కమీషన్లు వివరించినప్పటికీ.. బీసీల ఉద్యమాలను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పెడ చెవిన పెట్టిన సంగతిని బీసీ సమాజం గుర్తించాలని ఆమె కోరారు. 50 శాతం రిజర్వేషన్ లు దాటొచ్చు అనీ సుప్రీం కోర్ట్ సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ లు ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. 70ఏండ్లుగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్న తీరును గ్రామ గ్రామాన ఎండగడతామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు వివిధ పార్టీలలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మేధావులు గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధ్యక్షులు గూని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, కోశాధికారి గట్టు రమేష్ మండల నాయకులు వంగాల నవీన్, జింక కుమార్, గట్టు ప్రదీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.