రాజశేఖర్ హీరోగా 'శేఖర్' అనే సినిమా ఇటీవలె విడుదలైంది. ఈ సినిమాను జీవిత రాజశేఖర్ డైరెక్ట్ చేశారు. గత శుక్రవారం ఈ సినిమా విడుదలవ్వగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టులో కేసు వేశారు. ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి ఆయన కేసు వేయడంతో థియేటర్లలో శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. తాజాగా ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు సమాచారం. కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని, శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని న్యాయమూర్తి తెలుపడంతో జీవితా రాజశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి సంబంధించి జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం వివరాలను వెల్లడించనున్నారు.