దివంగత జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో మళ్లీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ, కొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 12.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట్ లోని ఎ సైకోథెరపీ సెంటర్ లో డబ్బులు దాచారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో కొందరికి డబ్బు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది శశికళ బంధువు దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఏప్రిల్ 12నే జరగాల్సి ఉంది. భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగిన నేపథ్యంలో, అప్పుడు ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే నెలకొనడం గమనార్హం. డిసెంబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది.