విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మూడోరోజు అమ్మవారిని సుమారు 50వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భవానీలు పెద్దయెత్తున పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకుంటున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లలో ప్రవేశించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహామండపం వద్ద గురుభవానీల సమక్షంలో ఇరుముడులు సమర్పించి హోమగుండంలో నేతి కొబ్బరికాయలు వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. భవానీల సంఖ్య పెరగడంతో అధికారులు లడ్డూల పంపిణీలో పరిమితి విధించారు. ఒక్కొక్కరికి 20లడ్డూలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు.